భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదు (75) సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సీఎం అన్నారు. ప్రస్థుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయంపాలనలో అభివృద్ది పథంలో దూసుకు పోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని సీఎం కేసీఆర్ అన్నారు.
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఉత్సవాలకు రూ.25 కోట్లు:
మార్చి 12, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్క్రతిక శాఖ డైరక్టర్ లు ఉంటారని సీఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు. ఆయా రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
మార్చి 12న హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్లు పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభకార్యక్రమాలు:
ప్రధానితో వీడియో కాన్పరెన్స్ అనంతరం కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం, సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సాంస్కృతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 12 న హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్లు పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లు పాల్గొంటారు. మార్చి 12న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలుంటాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపాలని సీఎం సూచించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని సీఎం అన్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను స్మరించుకుని జోహారులర్పించాలన్నారు. 75 వ స్వాతంత్య్ర ఉత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్ లో వున్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జండాలను ఎగురవేయాలని సీఎం తెలిపారు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి దేశభక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ