విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం ఉక్కు పరిశ్రమ కార్మికులు సోమవారం రాత్రి నుంచి విశాఖలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కూర్మన్నపాలెం మెయిన్ గేట్ దగ్గర కార్మికులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేయడంతో రాత్రిపూట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూర్మన్నపాలెం కూడలిలో రాత్రి నుంచి కార్మికులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే నిరసనలో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయాన్ని ముట్టడించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికులు చేస్తున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలును పెంచుతున్నారు.
ముందుగా సోమవారం నాడు లోక్ సభలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వానికి ఈక్విటీ షేర్ లేదని, ఉక్కు పరిశ్రమలో మొత్తం వందశాతం పెట్టుబడులు ఉపసంహరణ చేయనున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణలో నిర్దిష్ట విషయాలలో ఏదైనా అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని, అలాగే ప్రభుత్వం జోక్యం అవసరమయ్యే విషయాలలో కూడా వారి మద్దతు కోరబడుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉద్యోగులు మరియు ఇతర వాటాదారుల యొక్క చట్టబద్ధమైన ఆందోళనలు ప్రైవేటీకరణ సమయంలో వాటా కొనుగోలు ఒప్పందంలో చేసిన నిబంధనల ద్వారా పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ద్వారా అధిక ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటుగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాల విస్తరణకు వీలుంటుందని చెప్పారు. ఇక ఏపీ ప్రభుత్వం మరియు ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రైవేటీకరణ వైపే కేంద్రం మొగ్గుచూపడంతో కార్మిక సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ