జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతు వేదికను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచంలో, దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. రైతులు పంటలపై, మద్దతు ధరపై చర్చించుకోవడానికి, సంఘటితం కావడానికి రైతు వేదికలు ఒక శక్తిగా మారనున్నాయని అన్నారు. రాష్ట్రంలో 2601 రైతు వేదికలు నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లో అన్ని రైతు వేదికలు పూర్తవుతాయని చెప్పారు. వీటికోసం దాదాపుగా 600 కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామని సీఎం అన్నారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించే రోజు రావాలి, రైతులు లేకుంటే మీరెక్కడున్నారనే సంకేతం పంపించాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ సంకేతం పంపేందుకు రైతులు సిద్ధం కావాలని అన్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే:
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో రైతుల బాధలు, ఆత్మహత్యలను కళ్లారా చూసి, ఎంతో బాధపడి కన్నీరు పెట్టుకున్నానని తెలిపారు. సీఎం అయ్యాక కఠిన నిర్ణయాలు తీసుకుని, తెలంగాణ రైతాంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా పనిచేస్తున్నామన్నారు.
నిరూపిస్తే నిమిషంలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తా:
మరోవైపు బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అసత్య ప్రచారాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 38,64,751 మందికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కేవలం 6,95,000 మందికే ఇస్తుంది. అదికూడా మనిషికి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రం ఇచ్చేది కేవలం రూ.105 కోట్లు మాత్రమేనని అన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ లో రూ.1600లు కేంద్రమే ఇస్తుందని, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే ఒక్క నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. బీజేపీ నాయకులకు ఓట్లు మాత్రమే కావాలని, ప్రజలపై పట్టింపు ఉండదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ