లేదు.. లేదు.. అంటూనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే జోరుగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నీతి నియమాలు .. ఓడినా గెలిచినా ఒకే పార్టీ.. గతకాలపు చిహ్నాలుగా మారుతున్నాయి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడకే పోవడం తప్పుగానూ భావించడం లేరు. పోయే వాళ్లే కాదు అధికారంలోకి రాగానే ఇతర పార్టీవాళ్లను నయానో, భయానో, ఊరించో, ఉడికించో లాక్కునే కొత్త విద్యను గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆయన ఏ విద్యనైతే ప్రయోగించారో.. ప్రస్తుతం అదే విద్య ఆయన పార్టీకి ముప్పుగా మారనుంది. వస్తామంటే వద్దంటామా.. అంటూ కాంగ్రెస్లోకి చేరే వారిని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై పట్టున్న నాయకుడిగా పేరొందిన పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లోకి చేరడం ఇప్పటికే ఖాయమైంది. గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే సునీతా లక్ష్మారెడ్డి నుంచి మొదలుపెడితే మేయర్ విజయలక్ష్మి దాకా ఎందరెందరో బీఆర్ఎస్ నేతలు .. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు వారు రేవంత్రెడ్డిని కలవడం ఈ సందర్భంగా గమనార్హం. వారు చెప్పిన కారణాలు ఏవైనా అవసరమైతే అధికార పార్టీకి వెళ్లేందుకు, పదవులుపొందేందుకు తమ ‘దారి’ ఉందని చెబుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే మూడు జిల్లాలనుంచి దాదాపు అరడజనుమందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.
ఇప్పుడు తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లకు బొంతు నమ్మిన బంటు. అన్ని వేళలా వారితో కలిసి ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎక్కువ సమయం ప్రగతిభవన్ లోనే ఉండేవారన్న ప్రచారం జరిగేది. అయితే గత రెండు సార్లు ఆయన ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించారు. రెండు సార్లూ భంగపాటే ఎదురైంది. అయినప్పటికీ బొంతు వారి వెంటే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి ఎంపీ సీటు హామీ మేరకు ఆయన అదే పార్టీలో కొనసాగినట్లు తెలిసింది. తాజాగా ఆ విషయంలో ఆయనకు నిరాశే ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
బొంతు రామ్మోహన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయన 2005లో విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులై 2007 వరకు పని చేశారు. రామ్మోహన్ 2007 నుంచి 2009 వరకు టీఆర్ఎస్ కార్యదర్శిగా, విద్యార్ధి విభాగం ఇన్ఛార్జిగా పని చేసి, 2009 నుండి 2016 వరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. బొంతు రామ్మోహన్ 2016లో గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్ గా 7,869 ఓట్ల మెజారిటీతో గెలిచి, మేయర్ సీటును దక్కించుకున్నారు. బీఆర్ ఎస్ లో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే.. మేయర్ మినహా కీలక పదవులను పొందలేకపోయారు. ఈ అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే మరికొందరు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పలువురు భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE