నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బుధవారం నాడు హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్ తరపున పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆగమాగం కాకుండా, పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. విచక్షణతో నిజాన్ని గమనించి మంచిచేసే వాళ్ళని సమర్ధించాలని చెప్పారు. నోముల నర్సింహయ్య వారసుడిగా మీకు సేవ చేస్తాడని నోముల భగత్ ను అభ్యర్థిగా పెట్టామన్నారు. ఇక్కడ భగత్ గాలి బాగానే ఉందని, ఓటు రూపంలో డబ్బాలోకి కూడా రావాలని చెప్పారు. భగత్కు వచ్చే ఓట్లలాగే నెల్లికల్ లిఫ్ట్లో నీళ్లు కూడా దూకుతాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ సక్కగా ఉంటే తెలంగాణలో గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?:
30 ఏళ్ల చరిత్ర అని చెప్పే జానారెడ్డి నాగార్జునసాగర్ కు డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని సీఎం కేసీఆర్ విమర్శించారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో హాలియాలో డిగ్రీ కాలేజీ వచ్చిందని, త్వరలోనే సాగర్ లో కూడా వస్తుందన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వదిలిపెట్టిందని, కాగా తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పదవులను వదిలిపెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సక్కగా ఉంటే తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఎందుకు వస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారన్నారు. గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు గతంలో లేవని, ఇప్పుడు వస్తున్నాయన్నారు. రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నాం. అలాగే ఫ్లోరైడ్తో బాధపడుతున్న జిల్లా ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతున్నామని చెప్పారు. మరోవైపు స్థానిక కీలక నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 15 రోజుల లోపలనే మళ్ళీ సాగర్ కు వస్తానని, నియోజకవర్గ నేతలతో సమావేశమై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ