తెలంగాణ రాష్ట్రానికి ఆక్సీజన్ సరఫరాను రోజుకు 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి ప్రధాని మోదీతో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుంచి, కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు.
తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ వంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని, వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల వ్యాక్సిన్ డోసులను అందచేసిందని, కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు ప్రతిరోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోదీకి సీఎం విజ్జప్తి చేశారు.
కాగా సీఎం కేసీఆర్ విజ్జప్తి మేరకు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధానికి సీఎం విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమకూరుస్తామని, ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సీఎంకు హామీ ఇచ్చారు. ఆక్సీజన్ ను కర్నాటక తమిళనాడుల నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ