భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నేడు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో ఆయన పేరుపై ఏర్పాటు చేసిన స్మృతివనం ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరుకానున్నారు. కాగా 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది. పీఠం లోపల అంబేడ్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంబేడ్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దింది. కాగా షెడ్యూల్డ్ కుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో దీని డిజైన్ బాధ్యతను నోయిడా డిజైన్ అసోసియేట్స్కు అప్పగించింది. దీంతో ఆ సంస్థ రూ.146.50 కోట్లతో ప్రణాళిక రూపొందించగా.. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్జీ సుతార్ మరియు ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. ఈ క్రమంలో తొలుత ఉక్కుతో విగ్రహన్ని తీర్చిదిద్ది, దానిపై ఇత్తడి తొడుగులను అమర్చారు. ఈ ఇత్తడి విగ్రహం నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్కు తరలించారు. అలాగే విగ్రహం దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండటం కోసం ప్రత్యేకంగా పాలీయురేతీన్ కోటింగ్ వినియోగించారు. ఇక 2,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో వృత్తాకారంలో, చుట్టూ భారీ ఎత్తయిన పిల్లర్లతో స్మారక భవనాన్ని పార్లమెంట్ భవనం తరహాలో మూడంతస్తుల్లో రూపొందించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE