తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుతో పాటుగా పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అవినీతికి తావులేకుండా, పారదర్శకమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపట్టగా, అదే తరహాలో పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రజల ఆరోగ్య సూచిక రూపకల్పనకు కూడా ప్రభుత్వం సిద్దమవుతుంది. ఇటువంటి పలు అంశాలపై ఈ సదస్సులో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
[subscribe]