తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఫిబ్రవరి 3, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, ఇతర సూచనలను రెవెన్యూ అధికారులకు ప్రజలు అందించవచ్చని పేర్కొన్నారు. 30 రోజుల తర్వాత జోగిపేట, వేములవాడ లు రెవెన్యూ డివిజన్లుగా మారనున్నాయి. ఈ రెండింటితో కలిపి రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరుకుంది. గతంలోనే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.
[subscribe]