కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలుపై ఈ రోజు (జూన్ 8, సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై తాజా పరిస్థితులపై చర్చించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 7, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3650 కి చేరుకుంది. ఇప్పటికే 137 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిబంధనల అనుగుణంగా ఈ రోజు నుంచి దేవాలయాలు సహా అన్ని ప్రార్ధన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు రకాల చర్యలు, కఠినంగా అమలు చేయాల్సిన నిబంధనలపై ఈ రోజు సమావేశంలో సీఎం కేసీఆర్ కీలకంగా చర్చించి, తదుపరి ప్రణాళిక, కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu