డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని 2023, ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరపాలని నిర్ణయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం, ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య అతిధుల వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు.
నూతనంగా నిర్మించిన డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందుగా, శుక్రవారం ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా.బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, తదితర ముఖ్యులు పాల్గొంటారని తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత ఆరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ జరుగుతుందని, ఈ బహిరంగసభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE