కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి అన్ని పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సినీ నటులను తమ తరపున ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ బ్రహ్మానందం గురువారం బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. చిక్ బళ్లాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా బ్రహ్మానందం స్థానికులతో ముచ్చటించారు. వైద్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. కాగా ఈ నియోజకవర్గంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ మంది ఉండడంతో బ్రహ్మానందం తెలుగులో మాట్లాడుతూ ప్రచారం చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన.. తాను నటించిన హిట్ మూవీ ‘మనీ’ సినిమాలో ప్రాచుర్యం పొందిన ‘ఖాన్తో గేమ్స్ ఆడొద్దు’ అనే డైలాగ్ చెబుతూ తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. తనకు చాలాకాలంగా ఆయన తెలుసనీ, తనకు మంచి మిత్రుడని తెలిపారు. వైద్య రంగంలో డాక్టర్ సుధాకర్ ఎంతో సేవలందించారని, దేశం మొత్తం కర్ణాటక గురించి మాట్లాడుకునేలా చేసిన సుధాకర్కు ఓటు వేయాలని కోరారు. ఆయన మంచితనం, సేవలు చూసి ఆయనను గెలిపించేందుకు తనలాంటి ఎంతో మంది అండగా నిలుస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాగా ప్రచారం సందర్భంగా బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు పలువురు అభిమానులు ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వని బ్రహ్మానందం కర్ణాటక వెళ్లి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే గత ఎన్నికల్లో కూడా డాక్టర్ సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రచారం అనంతరం బ్రహ్మానందం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE