వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికై ఆమె చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి పునఃప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో 28 నుంచి మొదలయ్యే పాదయాత్ర కోసం వైఎస్సార్టీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో.. అక్కడి నుంచే కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన పాదయాత్రను ఆపి సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేశారని, అందుకే ఆయన పాలనకు ఈ యాత్రతోనే ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన అనుమతుల మేరకే పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపిన షర్మిల ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతానని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ అవినీతి ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని, దీనిపై తాను పాదయాత్ర మధ్యలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో గళం విప్పానని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ను అప్పుల మయం చేశారని, రైతుల రుణ మాఫీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న తెలంగాణ నేడు అప్పుల పాలవడానికి కారణం కేసీఆర్ యేనని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలుచేసిన జల యజ్ఞం, ఫీజు రియంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలను నేటికీ ప్రజలు గుర్తుంచుకున్నారని, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయన స్ఫూర్తితోనే తాను ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించానని పేర్కొన్నారు.
కాగా తెలంగాణలో 4,000 వేల కిలో మీటర్ల వరకు షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే 3512 కిలో మీటర్ల వరకు షర్మిల పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది అధికార పార్టీకి చెందిన శ్రేణులు ఆమె యాత్రను అడ్డుకున్న నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల కారణంగా పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె పాదయాత్రను అర్ధాంతరంగా ముగించి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ నెల 28 నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. అలాగే పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE