తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఈటల రాజేందర్. కేసీఆర్ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈటల.. తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగారు. కానీ అనూహ్యంగా ఈటలకు రెండు చోట్ల ఓటమే ఎదురయింది. హుజురాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోతే.. గజ్వేల్లో కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఈటల ఆశలన్నీ లోక్సభ ఎన్నికలపైనే పెట్టుకున్నారు.
కొద్దిరోజుల నుంచి ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే బీజేపీ పార్లమెంట్ స్థానాలకు ఉన్న పోటీ దృష్ట్యా ఈటలకు టికెట్ దక్కే అవకాశం లేదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మెదక్ టికెట్ రఘునందన్ రావు ఆశిస్తుంటే.. మల్కాజ్గిరి టికెట్ మురళీధర్ రావుతో పాటు మరికొందరు సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈటల ఎంత ప్రయత్నించినప్పటికీ టికెట్ దక్కకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. 17కు 17 స్థానాలు దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. మరో మూడు, నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచి ఎన్నికలపై ఫోకస్ చేసి ముందుకు కదులుతోంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇతర పార్టీల నేతలను ఆకర్షించినట్లుగానే.. ఇప్పుడు కూడా ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ఉన్న బలమైన నేతలకు వల వేస్తోంది.
ఈక్రమంలో కాంగ్రెస్ ఈటల రాజేందర్కు వల వేసినట్లు తెలుస్తోంది. బీజేపీలో లోక్ సభ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో.. ఈటలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపొంది మంత్రి కావడంతో.. కరీంనగర్ స్థానంలో కొత్త వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయట.
చివరికి ఈటల రాజేందర్ను పార్టీలోకి ఆహ్వానించి.. కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఈటల దమ్మున్న నేత కావడంతో.. ఆయన్ను నిలబెడితే ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవచ్చని భావిస్తోందట. ఇందుకోసం ఇప్పటికే పార్టీలోకి ఈటలను కాంగ్రెస్ ఆహ్వానించిందట. ఈ సమయంలో ఈటల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE