హైదరాబాద్లో నుమాయిష్ అంటేనే ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన క్రేజ్ కంటెన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం అయిందంటే చాలు లక్షలాది మంది జనాలు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఈసారి నుమాయిష్ ఎగ్టిబిషన్కు కరోనా ఎఫెక్ట్ ఉంటుందేమోనని నిర్వాహకులలో అనుమానం వ్యక్తమవుతుంది. జేఎన్ 1 కేసులు ఎక్కువ అవుతుండటం.. తెలంగాణలోనూ 60 కి పైనే వైరస్ కేసులు నమోదు కావడంతో నుమాయిష్కు సందర్శకులు వస్తారా? రారా? అన్న ఆందోళన అందరిలో తలెత్తింది.
నుమాయిష్ అంటేనే నచ్చిన షాపింగ్ చేసుకుని.. ఇష్టమైన ఫుడ్ తిని ఎంజాయ్ చేసే స్థలం. అయితే జేఎన్ 1 వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో.. నుమాయిష్పై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏడాది జనవరి 1న నుమాయిష్ ప్రారంభమవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి రెండో వారం వరకూ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా నుమాయిష్కు పేరుంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రకరకాల ఉత్పత్తులు విభిన్నమైన డిజైన్లతో ఒకేచోట దొరుకుతాయి. అది కూడా ఎక్కడా లేనంత చౌకగా దొరుకుతుండటంతో ప్రతి ఏటా జరిగే ఎగ్జిబిషన్ లో వస్తువులను కొనడానికి సిటీజనులు వెయిట్ చేస్తుంటారు. 1983లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమయింది .ఇప్పటి వరకూ 82 సార్లు నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించారంటేనే ప్రజల నుంచి ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకూ ఈ ఎగ్జిబిషన్ ను కొనసాగుతుంది. 5 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ ఇక్కడ వస్తువులు దొరకడంతో పేద, ధనిక తేడా లేకుండా ఎగ్జిబిషన్ కు క్యూ కడుతుంటారు.
హాలీడేస్లో అయితే మనిషి నడవాలంటే కూడా కష్టంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో ఎగ్జిబిషన్ రద్దీని కంట్రోల్ చేయడానికి చివరకు పోలీసుశాఖ కూడా ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. సుమారు రెండువేలకు పైగా స్టాళ్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రకరకాల వస్తువులు కళ్లుచెదిరేలా కనిపించడంతో.. చూసి వెళదామని అనుకుందామనుకున్నవాళ్లు కూడా అక్కడ వస్తువులు కొనుక్కుంటారు.
2019 వ సంవత్సరంలో నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి వందల సంఖ్యలో స్టాళ్లు బూడిదయ్యాయి. అదే సమయంలో కరోనా కేసులు పెరగడంతో అప్పుడు క్లోజ్ చేశారు. అలాగే కరోనా ఉధృతి తగ్గకపోవడంతో 2020లో నుమాయిష్ ఊసే ఎత్తలేదు. 2021లో నుమాయిష్ కు కరోనా వల్ల సందర్శకులు రాక తగ్గడంతో ప్రభుత్వం త్వరగానే క్లోజ్ చేయించాల్సి వచ్చింది.
తాజాగా జేఎన్ 1 కేసులు పెరగడం..అందులోనూ తెలంగాణలోనూ కేసుల సంఖ్య ఎక్కువ అవడంతో.. జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్పై ఆ ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన వ్యాపారుల్లోనూ, నిర్వాహకుల్లోనూ కనపడుతుంది. దీంతో ఈసారి నుమాయిష్ ప్రారంభం అయినా కూడా సందర్శకుల సంఖ్య ఆశించిన సంఖ్యలో ఉండదని అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE