తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను సోమవారం రాత్రి రిలీజ్ చేసింది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలకు ఇంకా పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితమే బీజేపీ 35 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయనుండటంతో.. కామారెడ్డి నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణలో ఆసక్తి నెలకొంది. కొండంగల్ నుంచి పోటీ చేయనున్న రేవంత్ రెడ్డి..ఇప్పటికే నవంబర్ 6న అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కాంగ్రెస్ రిలీజ్ చేసిన మూడవ జాబితా ప్రకారం.. రీసెంట్ గా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సభ్యత్వానికి రిజైన్ చేసిన డాక్టర్ జి. వివేకానంద్కు.. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నుంచి.. కేటీఆర్ కు పోటీగా కేకే మహేందర్రెడ్డిని కాంగ్రెస్ మరోసారి పోటీకి దింపింది.
అలాగే 1989 నుంచి పోటీ చేస్తూ వస్తున్న కామారెడ్డి సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ను.. ఈసారి నిజామాబాద్ అర్బన్కు మార్చారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా బరిలో దిగగా.. బీజేపీ నుంచి ధనపాయ్ సూర్యనారాయణ పోటీ చేస్తున్నారు. దీంతో వీరిద్దరిపై మహ్మద్ షబ్బీర్ అలీని తమ పార్టీ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం.
అంతేకాదు కాంగ్రెస్ రిలీజ్ చేసిన జాబితాలో బోథ్, వనపర్తి నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లు మారాయి. మాజీ మంత్రి జి.చిన్నా రెడ్డి, వన్నెల అశోక్ స్థానంలో వరుసగా తుడి మేఘారెడ్డి, అదే గజేందర్లను నియమించి.. ఆ ఇద్దరికీ షాక్ ఇచ్చింది అధిష్టానం. అయితే ఈ మార్పు పార్టీ సర్వేల ఆధారంగానే జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.అలాగే మొత్తంగా కాంగ్రెస్ మూడు జాబితాల్లో 116 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండు స్థానాలు పెండింగ్లో ఉన్నట్లు అయింది. కొత్తగూడెం సీటును మాత్రం సీపీఐకి కేటాయించింది.
బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ యల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అయిన ఏనుగు రవీందర్రెడ్డికి టికెట్ కన్ఫామ్ చేశారు. 2021 జూన్లో ఈటల రాజేందర్తో కలిసి బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్రెడ్డి..వారం క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు.అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్కు పటాన్చెరు నుంచి టికెట్ ఇచ్చారు.
ఇతర అభ్యర్థులు జుక్కల్-ఎస్సీ నుంచి తోట లక్ష్మీకాంతరావు , కరీంనగర్లో పురుమళ్ల శ్రీనివాస్ , నారాయణఖేడ్ టికెట్ సురేష్ కుమార్ షెట్కార్ కు, డోర్నకల్-ఎస్టీ టికెట్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ కు, ఇల్లందు-ఎస్టీ టికెట్ కోరం కనకయ్య, వైరా- ఎస్టీ టికెట్ రాందాస్ మాలోత్, సత్తుపల్లె-ఎస్సీ టికెట్ డాక్టర్ మట్టా రాగమయికి ఇచ్చారు. అలాగే అశ్వారావు పేట ఎస్టీ టికెట్ కోసం జారె అధినారాయణను నియమించారు. అయితే ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకున్నవాళ్లకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకే పెద్ద పీట వేయడంపై కాంగ్రెస్ వర్గీయులలో విమర్శలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE