తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ, గురువారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని తెలిపారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే రవీంద్ర భారతిలో కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జిఎడి కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీ.వి.ఆనంద్, జల మండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకెష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో పాటు పోలీసు, రోడ్లు భవనాలు, విద్యుత్, సమాచార శాఖ, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF