కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో మూడు రోజుల పాటుగా ‘చింతన్ శిబిర్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. చింతన్ శిబిర్ లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యచరణ సహా పలు అంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నిర్వహించిన చింతన్ శిబిర్ పై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయపూర్ చింతన్ శిబిర్ ఫలితంపై వ్యాఖ్యానించమని నన్ను పదే పదే అడుగుతున్నారు. నా దృష్టిలో చింతన్ శిబిర్ పార్టీ యొక్క యథాతథ స్థితిని పొడిగించడం తప్ప అర్థవంతమైన దేనినైనా సాధించడంలో విఫలమైంది. కనీసం గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల పరాజయం వరకు కాంగ్రెస్ నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడానికి ఉపయోగపడనుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ద్వారా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ అంచనా వేయడం గమనార్హం.
మరోవైపు గత నెలలో పలుమార్లు కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు. అనంతరం పార్టీలో చేరడంపై స్పష్టత ఇస్తూ, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపవర్డ్ గ్రూప్ లో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తన ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్టు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ కు తనకంటే లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరివర్తన సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF