సెప్టెంబర్ 16, 17,18 తేదీల్లో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 16, 17,18 తేదీల్లో హైదరాబాద్ తోపాటు అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఈ తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఈనెల 17వ తేదీ న జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపారు. అదేరోజు ఆదివాసీ, బంజారా భవన్ లను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం నెక్లెస్ రోడ్ నుండి గుస్సాడీ, గోండ్, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీ సందర్బంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడించారు.
ఇక సెప్టెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలచే ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. ఇదేవిధమైన కార్యక్రమాలను 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్టు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హ్యాండ్లూమ్ టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రకాష్, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY