ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ-టీడీపీ’ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆ వీడియో అంశంపై దర్యాప్తు చేయాలని సీఐడీ అదనపు డీజీకి ఎంపీ గోరంట్ల మాధవ్ లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియో క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోతో ఎంపీనైన తనకు తీవ్ర పరువు నష్టం జరిగిందని, దీని వెనుక టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ-టీడీపీ’ హస్తం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని గోరంట్ల మాధవ్ ఫిర్యాదులో కోరారు. ఈ మార్ఫింగ్ వీడియోను ఐ-టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని, ఈ శాఖ బాధ్యతలను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సుమారుడు విజయ్ నిర్వహిస్తున్నారని వివరించారు. కాగా ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ నేతృత్వంలో పని చేస్తోందని తెలిపారు.
అలాగే ఐ-టీడీపీతో పాటు యూకే ఫోన్ నెంబర్ ఉన్న తెలుగుదేశం పార్టీ వాట్సప్ గ్రూప్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా నేరపూరిత కుట్ర, ఫోర్జరీ కింద సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. మాధవ్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నం. 12/2022తో కేసు నమోదు చేశారు. ఐటి చట్టంలోని 66 (సి)తో పాటు ఐపిసిలోని 120-బి సెక్షన్లు 465, 469, 471, 153 (ఎ), 505 (2) రెడ్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇక ఇదిలా ఉండగా ఎంపీ వీడియో వెలుగు చూశాక దానిపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఇప్పటికే ఏపీ డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే ఈ వ్యవహారంపై కలుగజేసుకోవాలని రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా కోరిన సంగతి పాఠకులకు విదితమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ