టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆగస్టు 5, బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2008 లో జరిగిన ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్, పలువురు రాజకీయ ప్రముఖులు, టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మంత్రి హరీష్ రావు అన్నారు. “ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు.తెలంగాణ ఉధ్యమంలో జర్నలిస్టుగా, ఉధ్యమ కారుడిగా కీలక పాత్ర పోషించారు. నేను లింగన్న అని అత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురుదృష్టకరం. వారి అకాల మరణానికి సంతాపాన్ని తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని” మంత్రి హరీష్ రావు చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu