ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనావైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. దగ్గు, తుమ్ములు లేదా తలనొప్పి వచ్చినా కూడా కరోనా కావొచ్చేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
–> సాధారణంగా వేగంగా వచ్చే ఫ్లూ లక్షణాల మాదిరిగా కాకుండా, కరోనా వ్యాధిలో లక్షణాలు చాలా రోజుల తర్వాత కూడా బయటపడవచ్చు. ఈ వ్యాధిలో ఈ నాలుగు లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.
- జ్వరం
- రుచి, వాసన తెలియకపోవడం
- పొడిదగ్గు
- అలసట/ నీరసం
–> చాలా మంది బాధితులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కూడా కలిగిఉంటారు. కొంతమంది రోగులకు తేలికపాటి అనారోగ్యం మాత్రమే ఉంటుంది, కాని మరికొందరిలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. తలనొప్పి, ముక్కు కారటం, ఛాతీలో పట్టేసినట్టు ఉండడం, వికారం, వాంతులు, చలి మరియు విరేచనాలు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కరోనా కేవలం శ్వాసకోశ అనారోగ్యం కాదు, ఇది అనేక విధాలుగా ఉండవచ్చు. ఈ లక్షణాలు తక్కువగా, అరుదుగా, తీవ్రతగా ఉన్న కూడా కరోనా సంకేతాలుగా చూడవచ్చు.
–> కరోనా ముఖ్యంగా ముక్కు, కళ్ళు మరియు నోటి ద్వారా సులభంగా సంక్రమిస్తుంది. ముక్కులో ప్రధానంగా ఉండే గ్రాహకం ద్వారా ఈ వైరస్ శ్వాస మార్గంలోకి ప్రవేశించి, ఉపిరితిత్తులలోకి చేరుకోవడంతో, రోగులలో శ్వాస సంబంధిత లక్షణాలు వెంటనే మొదలయ్యే అవకాశం ఉంది. వైరస్ ఉపిరితిత్తులపై దాడి చేయడంతో కొందరిలో న్యుమోనియా వస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా పడిపోతుంటాయి, శ్వాస ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుని వ్యక్తులు ప్రమాదస్థితికి చేరుకునే అవకాశం ఉంది.
–> ఈ వ్యాధిలో సాధారణంగా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే కొంతమందిలో శరీరంపై దద్దుర్లు, తొడలు, కీళ్ళు మరియు కాళ్లలో నొప్పి తీవ్రంగా ఉండవచ్చు. అలాగే ఈ వైరస్ రక్త నాళాల లోపల అంటుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని అరుదైన కేసుల్లో ఉపిరితిత్తులు, గుండె లేదా మెదడుకు రక్తం ప్రయాణించే మార్గాల్లో రక్తం గడ్డకట్టడానికి కూడా వైరస్ కారణమవుతుంది. చాలా అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టి అవయవాలలో రక్త ప్రవాహాన్ని ఆపేసే అవకాశం ఉంది.
–> ఇక చిన్నపిల్లలలో కరోనా/ కరోనా లక్షణాలు సాధారణంగా మైల్డ్ గా ఉంటాయి. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలలో ఆందోళన కలిగించే సంకేతాలు లేదా లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
–> దీర్ఘకాలిక జ్వరం, నొప్పి, నీరసం, నీలిరంగు చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి మరియు వాంతులు వంటి లక్షణాలు చాలా కాలంగా ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే, పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయ్యేవరకు ఇతరుల నుండి వేరుగా ఉండాలి. చాలా మంది కరోనా బాధితులు కొన్ని వారాలలో స్వయంగానే కోలుకుంటున్నారు.
–> పల్స్ ఆక్సిమీటర్తో ఇంట్లోనే ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించుకుంటే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, జాగ్రత్తలు తీసుకోవచ్చు. కరోనాకు గురైన వారిలో తీవ్ర లక్షణాలు ఉంటే 5 నుండి 10 రోజులలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తక్కువ స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో, పల్స్ ఆక్సిమీటర్తో ముందుగానే చెక్ చేసుకుని లక్షణాలపై శ్రద్ధ పెట్టవచ్చు.
–> ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదా, అసౌకర్యం కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu