ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956 లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే కూచిపూడి నృత్యంతో ఆమె తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వెంపటి చినసత్యం వద్ద ఆమె శిష్యరికం చేశారు. నృత్యరూపాల్లో సత్యభామ, పద్మావతి వంటి అనేక పాత్రలను పోషించి, రాణించారు.
హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపాల్గా కూడా శోభానాయుడు పనిచేశారు. కూచిపూడి నృత్యంలో వందల మంది యువతకు శిక్షణ అందించారు. నృత్యకళాకారిణిగా ఆమె సేవలకు గానూ 2001లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే ఎన్నో నృత్య సంబంధిత పురస్కారాలను ఆమె దక్కించుకుని పేరు ప్రఖ్యాతలు గడించారు. పలు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నృత్య గొప్పదనాన్ని చాటి చెప్పారు. శోభానాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu