తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్.రమణ శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎల్.రమణకు గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎల్.రమణతో పాటుగా పలువురు నాయకులు, ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎల్.రమణ తనకు వ్యక్తిగతమైన స్నేహితుడని, ఎక్కడా ఉన్న సిద్దాంతాలకు అనుగుణంగా నిజాయతీగా పనిచేస్తారని అన్నారు. పార్టీలో రమణ చేరికతో చేనేత వర్గానికి రాజకీయ నాయకత్వం, ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. చేనేతలకు కూడా త్వరలోనే రైతుబీమా లాగా భీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. చేనేతలకు సంబంధించిన కార్యక్రమాలపై రమణ సేవలు ఉపయోగించుకుంటామని, ఆయనకు త్వరలోనే పెద్దపదవి కల్పిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు జూలై 9న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జూలై 12న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఎల్.రమణ అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ