హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా మరో కీలక ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్/రోడ్ ఓవర్ బ్రిడ్జిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూకట్పల్లి ప్రాంతంలో కైతలాపూర్ నుంచి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ మధ్య 675 మీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. మొత్తం రూ.86 కోట్ల వ్యయంతో ఎస్.ఆర్.డి.పిలో భాగంగా జీహెచ్ఎంసీ దీన్ని నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ తో కూకట్పల్లి మరియు హైటెక్ సిటీల మధ్య ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. రోజువారీగా ఐటీ కారిడార్ కు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఈ ఫ్లైఓవర్ వలన ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్, సురభి వాణీదేవి, జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత మోతే, పలువురు జీహెఛ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎస్.ఆర్.డి.పి కింద పేజ్-1లో రూ.8,052 కోట్లతో 47 కార్యక్రమాలు తీసుకున్నామని, అందులో భాగంగా కైతలాపూర్ ఫ్లై ఓవర్ 30వ ఫ్లైఓవర్ అని అన్నారు. ఇంకా 17 నిర్మాణ దశల్లో ఉన్నాయని, ఈఏడాది మరో ఆరు, వచ్చే ఏడాది మిగతావి ప్రారంభిస్తామని చెప్పారు. వాటితో పాటుగా ఎస్.ఆర్.డి.పి కింద పేజ్-2 కింద రూ.3,115 కోట్లతో మరికొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టిపెట్టి పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, అందుకు అనుగుణంగా దశల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY