ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్.. ఇలా భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ కొద్ది రోజులుగా తెలంగాణ చుట్టూనే తిరుగుతున్నారు. మరికొందరైతే ఏకంగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, మీట్ ది గ్రీట్, బహిరంగ సభల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, మోదీ నాయకత్వాన్ని బలపరచాలని.. రకరకాల నినాదాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణలో బీజేపీ.. బీఆర్ ఎస్ తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. అధికార పార్టీకి ఆ కాషాయ పార్టీయే ప్రత్యామ్నాయం అన్న ప్రచారం జరిగింది. ఓ దశలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. బీజేపీ మంచి స్పీడ్ లో ఉండగా.. ఏమైందో ఏమో.. కానీ.. హఠాత్తుగా బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించారు. కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు పలు కార్యక్రమాల ద్వారా హవా చాటిన బీజేపీ కొంచెం కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. అధికార పార్టీ అందరి కంటే ముందు.. ఒకేసారి దాదాపు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖం పూరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఒకటి, రెండు జాబితాల్లోనే మెజార్టీ అభ్యర్థులను ప్రకటించి టికెట్ల రేసులో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మాత్రం చివరి వరకూ నాన్చుతూనే ఉంది. కొందరి కొందరి పేర్లతో జాబితాల మీద జాబితాలు ప్రకటిస్తూ అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడింది.
అనూహ్యంగా జనసేనతో దోస్తీ కట్టి కాస్త రాజకీయం మార్చింది. తగ్గుతున్న గ్రాఫ్ ను పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ నాయకుల పర్యటనలు.. సాలు దొర సెలవు దొర క్యాంపెయిన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అగ్రనేతలు సుడిగాలు పర్యటనలు చేస్తూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లో అనేకమార్లు తెలంగాణా లో పర్యటించారు. అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ మైలేజీ పెంచే ప్రయత్నం చేశారు. అగ్రనేతలు ప్రచారంలోను, పార్టీలోను జోష్ అయితే నింపారు కానీ.. అభ్యర్థులకు ఎంత వరకు ఓట్లు పడతాయనేది ప్రశ్నార్థకమే. పార్టీలో ప్రజావ్యతిరేకతను మాత్రం కొంత తగ్గించే ప్రయత్నం చేశారు.
ఆదివారం (26వ తేదీ) కూడా మోదీ హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం చేగూరులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం తూఫ్రాన్ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. సాయంత్రం హకీంపేట ఎయిర్పోర్టు నుంచి తిరుపతికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ కూడా మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ ఆరు జిల్లాల్లో సభలు ముగిసిన తర్వాత హైదరాబాద్లో రోడ్షోలో పాల్గొని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. మొత్తంగా మోదీ తెలంగాణలో అధిక సార్లు పర్యటించి పార్టీలో పునరుజ్జీవం నింపే ప్రయత్నం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE