భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఖమ్మం జిల్లా కీలక నేత పువ్వాడ అజయ్ కుమార్ లు ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంత్యక్రియలకు హాజరయ్యారు. ముందుగా మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామానికి చేరుకొని ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు భౌతికకాయానికి పుష్పంజలి ఘటించి, నివాళులర్పించారు. శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను మంత్రులు ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస రావు అంతిమ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు కొద్దిసేపు పాడే మోస్తూ ముందుకు నడిచారు. అనంతరం ప్రభుత్వం తరుపున అధికార లాంచనాలతో శ్రీనివాస రావు అంత్యక్రియలను జరిపించారు. అలాగే ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు సహా పలువురు నాయకులు, అధికారులు హాజరయ్యారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో మంగళవారం నాడు గుత్తి కోయలు గొడ్డలితో దాడి చేయడంతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు మృతి చెందారు. శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాస రావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎఫ్ఆర్వో పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ లు ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE