ఇప్పుడు ఆయనో సంచలన నేత. జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పునరుజ్జీవనం తీసుకొచ్చిన సక్సెస్ఫుల్ అధినేత. జైలుకెళ్లొచ్చినా.. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. జంకూ, బొంకూ లేకుండా.. రాజకీయంగా మరో మెట్టు పైకే ఎదిగి.. ఇప్పుడు ఏకంగా అగ్రపీఠం వైపు అడుగులు వేస్తున్న టైగర్. ఒకప్పుడు ఆయనకు జడ్ పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ లు కూడా పార్టీలు నిరాకరించాయి. అయినా.. వెనుకడుగు వేయకుండా, స్వతంత్రంగా నిలబడి గెలిచి చూపించారు. దీంతో నిరాకరించిన పార్టీలే ఆయనను అక్కున చేర్చుకున్నాయి. ఆయనే ఎనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో.. దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని శాసనసభ సాక్షిగా గొంతెత్తిన రేవంత్ అనూహ్యంగా అదే పార్టీలో చేరి.. కాబోయే ముఖ్యమంత్రి గా ప్రచారంలో ఉన్నారు. రేపు పార్టీలోకి అధికారంలోకి వస్తే ఆయనకు సీఎం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మండలం స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు రేవంత్ రెడ్డి. తొడగొట్టి సవాల్ విసరడంలోనూ.. ముఖ్యమంత్రికే ఎదురెళ్లడంలోనూ ఆయనకు ఆయనే సాటి. అటువంటి నేత చేతుల్లో ఉంటేనే.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని నమ్మి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం ఆశలు ఆడియాశలు చేయకుండా పార్టీని విజయపథంలోకి తీసుకొచ్చారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రంలో అధినాయకుడు అయ్యారు. పదునైన వ్యూహాలు రచించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేబోతున్నారు.
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న రేవంత్ రెడ్డి 1990ల కాలంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా పని చేశారు. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు రేవంత్రెడ్డి. 2006లో మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జెల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ (జడ్పీటీసీ) నుంచి పోటీ చేయటానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అలా సంచలన నాయకుడిగా వార్తల్లోకి వచ్చారు. మళ్లీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్సీగా గెలిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి ఆ పార్టీలో చేరారు. ఆ మరుసటి ఏడాది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్-ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావటంతో యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) మే నెలాఖరులో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసింది.
ఆయనతో పాటు.. బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహా అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో రేవంత్రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు. జైలుకెళ్లి వచ్చిన ఆయన బోను నుంచి బయటకు వచ్చిన పులిలా ప్రత్యర్థులపై గర్జించారు. కావాలనే కేసులో ఇరికించారని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ప్రతిష్ట దిగజారుతున్న సమయంలో రేవంత్రెడ్డి కాంగ్రెస్లో కి వెళ్తారన్న వార్తలు వచ్చాయి. దీంతో టీడీపీ ఆయనను 2017 అక్టోబర్లో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే నెల చివరిలో రేవంత్రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా.. దిల్లీలో రాహుల్గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు.
నాటి డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రేవంత్.. నిరుత్సాహ పడకుండా.. ఆ వెంటనే 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అనంతరం 26 జూన్ 2021లో టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. అనంతరం పూర్తిగా పార్టీ కోసమే శ్రమించి రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చారు. బీఆర్ ఎస్ పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ, డ్రోన్ కెమెరాలతో ఆ పార్టీ నేతల భాగోతాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తూ సంచనాలకు నాంది పలికారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కోటను కూల్చే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సర్వేలన్నీ ఏకపక్షంగా కాంగ్రెస్ కు జై కొట్టాయి. ఆ పార్టీ లోని మెజార్టీ నేతలు, ప్రజలు సీఎం గా రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE