తెలంగాణను తెచ్చిన పార్టీకి.. ఇప్పుడు తెలంగాణలోని మెజార్టీ ప్రజల మద్దతు తగ్గింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఊపిరి పోసిన టీఆర్ఎస్.. సారీ.. బీఆర్ఎస్ రాష్ట్రంలో తిరస్కరణకు గురైంది. ఇందుకు కారణాలు ఏంటి..? తెలంగాణ అంటే బీఆర్ ఎస్ గా.. బీఆర్ ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీగా ముద్ర వేసుకున్న పార్టీ కి ఇప్పుడెందుకీ పరిస్థితి..? అందుకు కారణాలు ఏంటి?
మరో రాష్ట్రానికి పూర్తిగా దూరం అవుతామని తెలిసినా.. తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్ ను ఇక్కడి ప్రజలు కూడా నాడు తిరస్కరించారు. అటువంటి పార్టీ తెలంగాణలో ఇప్పుడు ఎలా ఎదిగింది..? అధికారంలోకి వచ్చే స్థాయికి తెచ్చిందెవరు? అందుకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి..? అనే అంశాలపై మ్యాంగో న్యూస్ రివ్యూ..
తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉండి.. రాష్ట్ర విభజన జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల కంటే.. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లోనే టీఆర్ ఎస్.. ప్రస్తుత బీఆర్ ఎస్ ఎక్కువ స్థానాలను సాధించింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించినప్పటికీ.. 88 స్థానాల బంపర్ మెజార్టీతో పార్టీ అధికారంలోకి వచ్చింది. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ సహా మొత్తం 16 మంది వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించి.. వంద మందికి పైగా ఎమ్మెల్యేలతో మరింత బలంగా మారారు. గత ఎన్నికల్లో ఉపయోగించిన స్ట్రాటజీనే మళ్లీ ప్రయోగించిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో కూడా సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. అయితే.. ఈసారి ఫలితాలు ప్రతికూలంగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
అందులో మొదటిది.. పేరు మార్పు. ఉద్యమ పార్టీగా.. ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. లోకల్ పార్టీగా జనాల్లో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ అంటే టీఆర్ ఎస్ గా గుర్తింపు పొందింది. అయితే.. జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఉబలాటపడిన కేసిఆర్.. పార్టీ పేరును మార్చేశారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి.. టీఆర్ ఎస్ కు వీడ్కోలు పలికారు. దీంతో ఉద్యమకారులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకూ రుచించలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను మరచిన కేసీఆర్.. 2023లో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా మైనస్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత.. జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తే ఆయనకు కలిసి వచ్చేది.
ఇంకోటి.. కుటుంబ పాలన. తండ్రి, కుమారుడు, కుమార్తె, మేనల్లుడు.. ఇలా కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వారే వరుసగా పదవులు అనుభవించడం కూడా చాలా మందికి నచ్చలేదు. ప్రాంతీయ పార్టీలో.. ఆ పార్టీ స్థాపకులకే అగ్ర పీఠం ఉండడం వాస్తవమే అయినా.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న విపక్షాల నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీంతో ఆ కుటుంబానికి ఇక చాలు.. అనే ఫీలింగ్ కొందరిలో మొదలైంది. వీటికి తోడు.. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కూడా బాగా ప్రచారం జరిగింది. వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణలు పెల్లుబికాయి. ధరణి పేరుతో రికార్డులు మాయం చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
అలాగే.. మూడోసారి కూడా పాత ముఖాలనే ఎమ్మెల్యేలుగా నిలబెట్టి కేసీఆర్ అతిపెద్ద తప్పు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల పార్టీలో పదేళ్లుగా పని చేస్తున్న ఎమ్మెల్యే ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీని విడిచి ప్రత్యర్థి పార్టీ గూటికి చేరారు. పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తిపై సహజంగానే వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు అదే బీఆర్ ఎస్ కొంపముంచింది. సిట్టింగ్లకే మళ్లీ టికెట్లన్న కెేసిఆర్ ప్రకటన ఓవర్ లోడింగ్ తో ఉన్న కారు వేగానికి బ్రేకులు వేశాయి. మరోవైపు.. వామపక్షాల సహకారంతో మునుగోడును గెలుచుకోవడంతో వామపక్షాలు పొత్తును ఆశించాయి. కానీ వారికి కేసీఆర్ హ్యాండిచ్చారు. ఇది కూడా ఆ పార్టీకి మైనస్ గా మారింది. లిక్కర్ స్కాంలో పలు మార్లు విచారణలు ఎదుర్కొన్న కుమార్తె కవిత కోసం.. కేసీఆర్ బీజేపీతో రాజీపడ్డారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఇది బీఆర్ ఎస్కు మైనార్టీ ఓట్లు తగ్గడానికి కారణమైంది. వీటికి తోడు.. పలు సందర్భాల్లో కేసీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలు.. మీడియాపై అసహనం వ్యక్తం చేయడం.. వంటివి కూడా ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడానికి కారణాలే.
బీఆర్ ఎస్ మైనస్ లనే.. ప్లస్సులుగా మార్చుకుంటూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎదిగింది. దొరల తెలంగాణ వద్దు.. ప్రజల తెలంగాణ కావాలనే నినాదంతో విస్తృత ప్రచారం చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ పై అసంతృప్తిగా ఉన్న కీలక వ్యక్తులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలను కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో విజయం సాధించారు. దీని వల్ల రెండు మూడు జిల్లాల్లో కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లు పడి.. ఏకపక్ష తీర్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
ఆరు నెలల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కూడా తెలంగాణపై ప్రభావం చూపింది. అక్కడ ఐదు గ్యారెంటీలతో గెలిచిన పార్టీ.. ఇక్కడ ఆరు గ్యారంటీలను ప్రజల ముందుంచింది. నాయకులు అందరూ తమ ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లే వరకూ అభ్యర్థులను ప్రకటించకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎక్కడైతే బీఆర్ ఎస్ లో అసంతృప్తి ఉందో.. అక్కడ కీలక నేతలను తమ వైపు తిప్పుకుని ఆయా ప్రాంతాల్లో పాగా వేసింది. దీనికితోడు.. కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించి పార్టీలో గ్రూపు తగాదాలను సద్దుమణిగేలా చేసింది. రేవంత్ రెడ్డి ప్రచార సభలు, భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా పార్టీ గెలుపునకు దోహదపడ్డాయి. బీఆర్ ఎస్ కు పోటీగా ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల ఎంపిక తో కాంగ్రెస్ గెలుపునకు పునాది పడింది. కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతిపై విపరీతంగా ప్రచారం చేసి.. ప్రజల్లో బీఆర్ ఎస్ పై వ్యతిరేకత వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రకటనలు కూడా ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ కు అనుకూలంగా మౌత్ టాక్ ఓ రేంజ్ లో నడిచింది. పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు పడే వరకు కూడా అది కొనసాగినట్లు స్పష్టం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE