నిత్యం వివిధ పనులు, విధుల నిమిత్తం నగరంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 3వేల పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా సర్కిళ్లు, జోన్ల వారిగా రద్దీగా ఉండే ప్రాంతాలలో అనువైన ప్రభుత్వ స్థలాలలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ప్రతి జోన్లో 1200 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించుటకు స్థలాలను ఎంపిక చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన 3వేల మరుగుదొడ్ల లక్ష్యాలను మించి 7200 మరుగుదొడ్లను వేగంగా నిర్మించుటకు అనువైన నాణ్యమైన ఆధునిక డిజైన్లను ఎంపిక చేయడం జరిగింది. వీటిలో ఇప్పటి వరకు 1536 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తైంది. 4271 మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 1393 మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ అండర్ ప్రాసెస్లో ఉంది.
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆగష్టు 15 లోపు లక్ష్యాలను అదిగమించనున్నారు. నగరంలో చేపట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ ప్రగతిని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ రెగ్యులర్గా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పనుల ప్రగతిని సమీక్షించి వేగంగా పూర్తిచేసేందుకు తగు సూచనలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డిజైన్లను రాష్టంలోని మున్సిపాలిటీలు మోడల్ గా తీసుకున్నాయి. బి.ఓ.టి పద్దతిలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను 10 సంవత్సరాలు పాటు నిర్వహించే బాధ్యతను సంబంధిత ఏజెన్సీలకే అప్పగించడం జరిగింది. అలాగే లూకేఫ్, పి.పి.పి మోడల్లో కూడా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఆధునిక డిజైన్లతో షీ-టాయిలెట్లు, బయో టాయిలెట్లను నిర్మించడం జరుగుతుంది.
“టెండర్లు పిలిచినప్పటికీ ముందుకు రానిచోట జీహెచ్ఎంసీ నిధులతో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మెరుగుపర్చేందుకు 20 టాయిలెట్లను ఒక క్లస్టర్గా చేసి ఒక ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుంది. ఈ క్లస్టర్లో ఉన్న మరుగుదొడ్లను ప్రతి రోజు ఐదు విడతలు నిర్దేశిత సమయాల్లో పరిశుభ్రం చేయడం సంబంధిత ఏజెన్సీ బాధ్యత. ఈ ఏజెన్సీకి ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్తో పాటుగా నిర్వహణ సిబ్బంది ఉంటారు. ఆధునిక పద్దతిలో 90శాతం గాలి, 10 శాతం నీటిని వినియోగించి రసాయనలతో క్లస్టర్లలో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రం చేయించడం జరుగుతుంది. మహిళల కొరకు ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్ల డిజైన్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగిందని” జీహెచ్ఎంసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu