తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41,392 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి పూర్తిగా ఓపెన్ అవుతున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ యధావిధిగా అకడమిక్ ఇయర్ ప్రారంభించనున్నారు. వేసవి సెలవుల పొడిగింపు లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయిన నేపథ్యంలో.. ఈసారి మాత్రం పాఠశాలలు సమయానికే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.
కాగా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 1-8 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 1.04 లక్షల మంది టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇచ్చామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కూర్మంలో తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. అలాగే ‘బడి బాట’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మందికి పైగా పిల్లలను కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటానికి చొరవ చూపామని మంత్రి ప్రకటించారు. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులతో పాటు స్కూల్స్ యాజమాన్యాలకు కూడా మంత్రి సబిత సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ