తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు. అక్టోబర్ 28, సోమవారం నాడు అలాంటి మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సత్తుపల్లి డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న నీరజ, ఖమ్మంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తీవ్ర వేదనకు గురైన క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటనతో సత్తుపల్లి పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్తుపల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. స్టేషన్ లోకి వచ్చే వాహనాలను అడ్డుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ సోమవారం నాడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఖమ్మంలో మహిళా కండక్టర్ నీరజ మృతి చెందడంతో ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు ఆమె మృతదేహంతో కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి, పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ ముట్టడికి యత్నిస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర డిపోల వద్ద కూడ ఆర్టీసీ కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
[subscribe]