హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ఈ రోజు (అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. నియోజకవర్గంలో మొత్తం 302 కేంద్రాల్లో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు.
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.45 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నేరేడుచర్ల మండలంలో చింతబండ గ్రామంలో ఈవీఎంలు మొరాయించగా అధికారులు వెంటనే సరిదిద్దే పనిలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలలో పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ డిపార్టుమెంటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి.
[subscribe]