తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించారు. ఖమ్మంలో ఐటీ హబ్-2 కు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో రూ.60.20 కోట్లతో నిర్మించిన 1,004 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఖమ్మం పట్టణంలోని శ్రీ శ్రీ సర్కిల్ నుండి వెంకటాయపాలెం వరకు నిర్మించే నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక సత్తుపల్లిలో పురపాలక సంఘం భవనాన్నిప్రారంభించారు. అలాగే సత్తుపల్లిలోని దోబీ ఘాట్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ఐటీ హబ్-2 కు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉండేవి. కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులు ఇక్కడ ఉంటాయా? అనే వాదనలు వినిపించాయి. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు 56 వేల కోట్ల రూపాయలు ఉంటే, 2021కి లక్షా 40 వేల కోట్ల రూపాయలకు ఎగబాకిందనీ చెప్పారు. సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్కు మాత్రమే ఐటీని పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఖమ్మంలో ఇప్పటికే ఒక ఐటీ హబ్ ప్రారంభమైంది. ఐటీ విస్తరణలో భాగంగా తాజాగా రెండో హబ్ కు కూడా శంకుస్థాపన నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ