అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో అక్టోబర్ 16, బుధవారంతో వాదనలు ముగిసాయి. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ధర్మాసనం ఎదుట వాదనలు ఈ రోజుతో ముగియగా, తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే, ఇరువర్గాలు మూడు రోజుల్లోపు లిఖిత పూర్వక నివేదికలను అందజేయొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవి విరమణ చేయబోతుండంతో ఆ లోపే తుది తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు.
ఈ రోజు విచారణ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రంజన్ గొగోయ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విచారణ ముగింపు దశకు వచ్చిందని, త్వరలోనే ఈ కేసుకు ముగించనున్నట్టు రంజన్ గొగోయ్ తెలిపారు. ముందుగా సాయంత్రం ఐదుగంటల వరకు వాదనలు కొనసాగుతాయని భావించగా, గంట ముందుగానే వాదనలు ముగించారు. కేసు విచారణ పూర్తి చేసుకుని, తీర్పు రిజర్వ్ కావడంతో తుది ప్రకటనపై దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్టోబర్ 13, ఆదివారం నుంచే సెక్షన్ 144ని విధించారు. డిసెంబర్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేసారు.
[subscribe]