రేపు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగనున్న పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈమేరకు గ్రేటర్ పరిధిలోని హెచ్ఐసీసీలో గత 10 రోజుల నుంచి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పార్టీ కార్యకర్తలతో కూడిన ఏడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ప్రకటించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం ఏర్పాట్లు, అలంకరణ మరియు వేదిక వద్ద ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ మరియు వాలంటీర్ల నిర్వహణ, పార్కింగ్, ఆహారం మరియు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఏడు కమిటీలను నియమించారు.
సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహ్వానం మేరకు ప్లీనరీలో పాల్గొనేందుకు ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ తమ పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి కూడలిలో జరుపుకోవాలని, పార్టీ జెండాను ఎగురవేయాలని మిగిలిన పార్టీ క్యాడర్ను కోరారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఇంతకుముందు ప్లీనరీకి పార్టీ నుంచి ప్రతినిధులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించేవారు. అయితే ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ఈసారి 3,000 మందిని ఆహ్వానిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లను ఆహ్వానించారు.
సుమారు 200 మంది ముఖ్యనేతలు ఆశీనులయ్యేలా వేదికను నిర్మించారు. కాగా ప్లీనరీకి హారవనున్న అతిథుల కోసం 33 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ జెండాను ఎగురవేసి ప్లీనరీని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి కేసీఆర్ ప్లీనరీని ప్రారంభించనున్నారు. అనంతరం కేసీఆర్ ప్రసంగం అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈసారి ప్లీనరీలో పార్టీ 11 అభివృద్ధి, రాజకీయ అంశాలపై తీర్మానాలను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ కేడర్తో పాటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ