టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన యువ సంఘర్షణ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ‘యూత్ డిక్లరేషన్’ను ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డితో కలిసి ఆమె యువత కోసం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ను విడుదల చేశారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో భాగంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ తరహాలో ఐదు వాగ్దానాలు చేసిన ప్రియాంక.. కలలను సాకారం చేసుకునేందుకు యువత ఓడిపోకుండా వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ‘నేను త్యాగాల పార్టీ నుంచి వచ్చాను.. త్యాగాల కుటుంబం నుంచి వచ్చాను.. తెలంగాణ కోసం పోరాడిన యువత స్ఫూర్తిని అర్థం చేసుకున్నాను. రాష్ట్రం కోసం వేలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. చూడలేక సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మీ కలలు నెరవేరాయా? నీళ్లు, నిధులు మరియు నియమాలు మీకు అందాయా?’ అని ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ ఇంకా ఇలా అన్నారు.. ‘రాష్ట్ర ఏర్పాటుతో మంచి జరుగుతుందని అంతా భావించారు. కానీ, విచారకరం.. ప్రజల కలలు కల్లలయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం పూర్తి కాలేదు. నీళ్లు, నిధులు, అన్నీ అధికార పార్టీ నేతలకే చేరుతున్నాయి, అధికారంలో ఉన్నవారి బంధువులు, స్నేహితులకే ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు ఆగిపోయాయి. పాఠశాలలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చారా!? నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే.. ఒక్కో నిరుద్యోగికి రూ.1.50 లక్షల దాకా చేతికి వచ్చేది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ ప్రక్రియ జరగడం లేదు. టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ, పేపర్లు లీకయ్యాయి. ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వారికేమైనా న్యాయం చేశారా?’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ‘ప్రభుత్వ విభాగాల్లోని 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు చొప్పున భృతి అందిస్తాం. 18 సంవత్సరాదాటిన ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇస్తాం. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం. ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తాం. అమరుల కుటుంబాలకు ఉద్యోగం, పెన్షన్ అందిస్తాం. జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం. బడుగు బలహీన వర్గాల పిల్లల చదువులకోసం ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. టీఎస్పీఎస్సీ బలోపేతం చేస్తాం’ అంటూ ప్రియాంక గాంధీ హామీలు ప్రకటించారు. కాగా అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో భాగంగా ప్రియాంకను నయా ఇందిర అని సంబోధించినప్పుడు సభ మొత్తం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE