అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం రాజధాని నగరంపై మరింతగా ఉంది. గడచిన ఐదు రోజులుగా హైదరాబాద్పై ముసురు కమ్ముకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు నగరం పరిధిలోని పలు రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట మట్టానికి చేరడంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేశారు. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు అధికారులు ప్రతి రిజర్వాయర్కు రెండు వరద గేట్లను ఒక అడుగుల ఎత్తుకు ఎత్తివేసి అదనపు నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.
అవుట్ ఫ్లో కన్నా ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1786 అడుగులకు చేరింది. అలాగే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో 1763 అడుగుల మేర నీరు చేరింది. హైద్రాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా, అధికారులు గత రెండు రోజులుగా ఈ జంట జలాశయాల నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఉస్మాన్సాగర్ నుంచి 686 క్యూసెక్కులు, హిమాయత్సాగర్ నుంచి 208 క్యూసెక్కులు విడుదల చేసినట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ డైరెక్టర్-టెక్నికల్ పీ రవికుమార్ తెలిపారు. ఇక నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ కు కూకట్ పల్లి నాలా నుంచి భారీ వరద నీరు చేరడంతో గరిష్ట మట్టానికి చేరుకుంది. దీంతో తూముల ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ