నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నేడు (డిసెంబర్ 31, శనివారం) హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఫ్లైఓవర్లను మూసివేతతో పాటుగా, పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలోనే ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులు మరియు మార్గదర్శకాలను జారీ చేసినట్టుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
శనివారం రాత్రి 10 గంటల నుండి ఆదివారం ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా తేలికపాటి మోటారు వాహనాల కోసం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయబడుతుంది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలకు మినహా వాహనాలకు మూసివేయబడుతుందని తెలిపారు. అలాగే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు 1 అండ్ 2, షైక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్ మరియు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాబు జగ్జీవన్ రామ్ (బాలానగర్) ఫ్లై ఓవర్లపై అన్ని వాహనాలు మరియు పాదచారుల కదలికల కోసం రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయని చెప్పారు. ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవాలని మరియు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా బార్/పబ్/క్లబ్ తెలిసి లేదా నిర్లక్ష్యంగా తమ కస్టమర్లు/అసోసియేట్లు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన అనంతరం, వారిని వాహనాలు నడపడానికి అనుమతిస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని మరియు నేరానికి సహకరించినందుకు సంబంధిత యాజమాన్యంపై విచారణ జరుగుతుందన్నారు. వారు తమ కస్టమర్లు/అసోసియేట్లకు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాలపై ఖచ్చితంగా అవగాహన కల్పించాలని మరియు ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణం నుంచి వాహనం నడపకుండా ఆపాలని సూచించారు.
తాగి వాహనం నడపడం వల్ల కలిగే పరిణామాలు, ఫైన్స్ పై కూడా పోలీసులు ప్రకటన చేశారు. మోటారు వాహనాల చట్టం,1988లోని u/s 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిపై కేసులు బుక్ చేయబడతాయి మరియు వారందరినీ తగిన సమయంలో కోర్టుకు పంపిస్తామని అన్నారు. మొదటి నేరానికి రూ.10000 జరిమానా మరియు/లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, రెండవ లేదా తదుపరి నేరానికి రూ.15000 జరిమానా మరియు/లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.
అలాగే మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 19 ప్రకారం సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్లన్నీ స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్టీవోలకు పంపబడతాయన్నారు. మొదటి నేరానికి డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుందని మరియు రెండవ మరియు తదుపరి నేరాలకు, డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయబడుతుంది, ఆ వ్యక్తి భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హుడుగా ప్రకటించబడతారని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదం చేసిన, ఎవరైనా మరణానికి కారణమైనట్లయితే వారిపై క్రిమినల్ కేసు ఐపీసీ యొక్క U/s 304 పార్ట్-II కేసు నమోదు చేయబడుతుందని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపించబడతారని తెలిపారు.
.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE