బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా కొద్ది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో పార్టీని నడిపించే బాధ్యత ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీద పడింది. తన కర్తవ్యాన్ని ఆయన త్రికరణ శుద్ధితో నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఆయా సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ, ఓటమి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి 170 తప్పులు చేయడమే కారణమని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఓడిపోయామని కూడా అన్నారు. దీనిపై సొంత నేతల నుంచే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేస్తే మేమే గెలిచే వాళ్లమని అన్నారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను నమ్మి ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామీలుగా ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని కేటీఆర్ అంటున్నారు. గురువారం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చారంటూ ఓ వైపు అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే.. లోక్ సభ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై సొంత పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపంచారు. తొమ్మిది న్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేసుకోలేదన్నారు.
దేశంలో అందరికన్నా రాష్ట్రంలో బాగా పని చేసినప్పటికీ, చేసిన పనులపై ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్లం అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారం గురించి ఏనాడు ఆలోచించలేదన్నారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్ఠంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి మనకు తేడా కేవలం 1.85 శాతమేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. లోక్ సభలో పునరావృతం కాకుండా కేటీఆర్ తీవ్రమైన కృషి చేస్తున్నారు. నేతలను కలుస్తూ.. వారితో ఉత్సాహం నింపుతున్నారు. ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుందాం. అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుందాం.. అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గిరి జనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పోడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కొనసాగించింది. అయినా గిరిజనులు ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నింటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకుపోదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపుఇస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE