బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు ఆయన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఐదో విడత ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ ముందుకు సాగుతోందని, బండి సంజయ్ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఎదురు చూస్తున్నారని, వారికి బీజేపీ రూపంలో మంచి ప్రత్యామ్నాయం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల నిధులు అందిస్తోందని, ఇప్పటివరకు రాష్ట్రంలో 4,996 కి.మీ మేర రోడ్లు నిర్మించామని తెలిపారు. ఇక తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు విచారించిందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని నడ్డా కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారిందని.. త్వరలోనే అది వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) పార్టీగా మారనుందని ఎద్దేవా చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరైనట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. భైంసా నుంచి ప్రారంభమైన ఐదవ విడత యాత్ర 8 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా 222 కిలోమీటర్ల దూరం కొనసాగి నేటితో కరీంనగర్లో ముగిసింది. కాగా ఇప్పటివరకు ఐదు విడతల పాదయాత్రలో సంజయ్ మొత్తం 56 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ