సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నాను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, అతని తరపు బంధువులు ఆగ్రహంతో జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఇనుప కుర్చీలతో దాడి చేయడంతో, జూనియర్ డాక్టర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ దాడికి నిరసనగా నిన్న రాత్రి నుంచి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఈ ఘటనపై కొంతమంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిశారు.
కరోనాపై పోరాటంలో ముందుండి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా రక్షణ బలగాల్ని ఏర్పాటు చేయాలనీ కోరారు. కేవలం గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కరోనా వైద్య పరీక్షలు, చికిత్స చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు జూనియర్ డాక్టర్ పై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. డాక్టర్లపై దాడిని ఎట్టిపరిస్థితుల్లో సహించమని, ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ విభాగం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu