తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2023, జనవరి 18వ తేదీ నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం పలువురు తెలంగాణ రాష్ట్ర మంత్రులు సమీక్షించారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లాల ఇతర అధికారులతో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి.హరీశ్ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంధన శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కంటి వెలుగు కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం మిషన్ విధానంలో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. పౌరులందరికీ కంటి స్క్రీనింగ్, దృష్టి పరీక్షలు నిర్వహించడం, కళ్లద్దాలు ఉచితంగా అందించడం మరియు సాధారణ కంటి జబ్బులకు మందులు అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి విడతలో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని, 50 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అందించామని తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చేలా ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ నెల 12వ తేదీలోపు జిల్లా మంత్రి, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలు, విధివిధానాలు, షెడ్యూల్పై చర్చించేందుకు మండల పరిషత్లు, పురపాలక సంఘాల ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి కార్యక్రమం అమలును పర్యవేక్షించాలని కోరారు. జిల్లాలవారీగా క్యాంపు లొకేషన్, ఏర్పాట్లు, లాజిస్టిక్స్ను ఇప్పటికే ప్లాన్ చేశామని, జిల్లాలకు ఇప్పటికే 30 లక్షల కళ్లద్దాలు పంపించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ముందస్తుగా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని, శిబిరాల వద్ద షామియానాలు, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, క్యూల నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పీఆర్ అండ్ ఆర్డీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హెల్త్ సెక్రెటరీ ఎస్ఏఎం రిజ్వీ, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ కమిషనర్ శ్వేతా మొహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE