మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ముంబై లోని వాంఖడే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒత్తిడిని అధిగమిస్తూ టీమిండియా రెండు పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన యువ పేసర్ శివమ్ మావి తన పదునైన పేస్తో శ్రీలంకను వణికించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అరంగేట్ర టీ20లోనే 4 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా శివమ్ మావి నిలిచాడు. గతంలో ఓజా, బరిందర్ శరణ్ ఈ ఫీట్ సాధించారు. ఇక బ్యాటింగ్లో సత్తా చాటిన దీపక్ హుడా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. శుభ్మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7), సంజూ శాంసన్ (5) రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 46 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇషాన్ కిషన్ (37), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (29) కొద్దిసేపు నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో 94 రన్స్కే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో దీపక్ హుడా (23 బాల్స్లో 41), అక్షర్ పటేల్ (20 బాల్స్లో 31) మరో వికెట్ పడనివ్వకుండా లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్ చేసింది.
అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు షాకిచ్చారు. నిస్సంక (1), ధనంజయ డిసిల్వా (8), చరిత్ అసలంక (12), భనుక రాజపక్స (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ కుశల్ మెండిస్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 68 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకొచ్చిన కెప్టెన్ శనక (27 బాల్స్లో 41), హసరంగా (10 బాల్స్లో 21) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో విజయానికి చేరువైంది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో 13 రన్స్ అవసరమైన దశలో.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో కరుణరత్నె సిక్సర్తో టీమిండియా శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే ఒత్తిడిని అధిగమిస్తూ అక్షర్ 10 పరుగులే ఇవ్వడంతో భారత్ గట్టెక్కింది. కాగా ఈ ఓవర్లో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌటయ్యారు.
స్కోరుబోర్డు
భారత్: ఇషాన్ కిషన్ (సి) ధనంజయ (బి) హసరంగ 37; గిల్ (ఎల్బీ) తీక్షణ 7; సూర్యకుమార్ (సి) రాజపక్స (బి) కరుణరత్నె 7; సంజూ శాంసన్ (సి) మధుశంక (బి) ధనంజయ 5; హార్దిక్ పాండ్యా (సి) మెండిస్ (బి) మధుశంక 29; దీపక్ హుడా (నాటౌట్) 41; అక్షర్ పటేల్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 162/5.
బౌలింగ్: రజిత 4-0-47-0; మధుశంక 4-0-35-1; తీక్షణ 4-0-29-1; కరుణరత్నె 3-0-22-1; ధనంజయ 1-0-6-1; హసరంగ 4-0-22-1.
శ్రీలంక: నిస్సాంక (బి) మావి 1; కుశాల్ (సి) శాంసన్ (బి) హర్షల్ 28; ధనంజయ (సి) శాంసన్ (బి) మావి 8; అసలంక (సి) ఇషాన్ (బి) ఉమ్రాన్ 12; రాజపక్స (సి) హార్దిక్ (బి) హర్షల్ 10; షనక (సి) చాహల్ (బి) ఉమ్రాన్ 45; హసరంగ (సి) హార్దిక్ (బి) మావి 21; కరుణరత్నె (నాటౌట్) 23; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) మావి 1; రజిత (రనౌట్) 5; మధుశంక (రనౌట్) 0; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 160 ఆలౌట్.
బౌలింగ్: హార్దిక్ 3-0-12-0; శివమ్ మావి 4-0-22-4; ఉమ్రాన్ మాలిక్ 4-0-27-2; యజ్వేంద్ర చాహల్ 2-0-26-0; హర్షల్ 4-0-41-2; అక్షర్ 3-0-31-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE