టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం, అదే టిఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం అనే నినాదంతో ప్రచారంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే అర్ధం పర్ధం లేని సవాళ్లకు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఉపఎన్నికల ఫలితాన్ని, తెరాస ప్రభుత్వ పాలనకు రిఫరెండంగా తీసుకుంటారా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సవాల్ స్వీకరించేది లేదని, గతంలో కూడ ఉత్తమ్ అనేక సవాళ్లు చేసి తోకముడిచారని తెలిపారు. హుజూర్నగర్ లో తెరాస ఘనవిజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేసారు.
హుజూర్నగర్ ఎన్నికలకు సంబంధించి ప్రచార, ప్రణాళిక వ్యూహాలు చేపట్టే బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పార్టీ ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హుజూర్నగర్ ఉపఎన్నికకు పార్టీ నుంచి 30 మంది పార్టీ నేతలను నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు ఇంచార్జ్ లుగా నియమించినట్టు కేటీఆర్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడ పాల్గొంటారని తెలిపారు. తాజాగా నిర్వహించిన సర్వేలో టిఆర్ఎస్ కు 54.64 శాతం, కాంగ్రెస్కు 42 ప్రజల మద్ధతు ఉన్నట్లు తెలిసిందని, బీజేపీకి చాలా దూరంగా మూడోస్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు.
[subscribe]