గత కొన్ని రోజులుగా ప్రారంభం వాయిదా పడుతూ వస్తున్నా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు, సెప్టెంబర్ 26 గురువారం నాడు పట్టాలెక్కింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజులపాటు నడిచే ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో ఒకటో నెంబర్ ప్లాట్ఫాంపై నుంచి ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఏసీ, డైనింగ్ సదుపాయాలు, టీవీ, ఆటోమేటిక్ టీ, కాఫీ వెండింగ్ మిషన్లు, దూరం వివరాలు ప్రకటన లాంటి సరికొత్త సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ రైలు గురు, ఆదివారాలు తప్ప వారానికి ఐదు రోజులపాటు పరుగులు తీయనుంది.
ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలుకు విశాఖపట్నం నుంచి విజయవాడకు టికెట్ ధర రూ.525 గా నిర్ణయించారు. విశాఖ నుంచి విజయవాడ (02701) వచ్చే ఉదయ్ రైలు తెల్లవారుజామున విశాఖలో 5:45 గంటలకు బయల్దేరి ఉదయం 11:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే (02702) ఎక్స్ప్రెస్గా విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్ల కోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, జీవీఎల్ నర్సింహారావు, గొట్టేడి మాధవి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
[subscribe]