మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 25 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. తద్వారా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన వివేకా కూతురు సునీతా రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరించినట్లైంది. అలాగే దీంతో పాటు సీబీఐ విచారణ గడువును కూడా అత్యున్నత న్యాయస్థానం పొడిగించింది. గతంలో ఈనెల 30వరకూ ఉన్న విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక సునీత తరపున సిద్దార్థ లూద్రా, ఎంపీ అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అటు అవినాష్, ఇటు సునీత తరఫు లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది.
మరోవైపు విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సాంప్రదాయాలకు దారి తీస్తాయని పేర్కొంది. ఇక అనుమానితులను ప్రశ్నించే సందర్భంగా.. లిఖిత పూర్వక ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు బెయిల్పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. ఈ విజ్ఞప్తిని సుప్రీం అంగీకరించలేదు. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహించుకుంటున్నారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా? అని పేర్కొంటూ ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో దూకుడుగా ముందుకెళ్తోన్న సీబీఐ.. ఇప్పుడు అవినాష్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ