తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు గురువారం నాడు నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో 2020-21 కు సంబంధించి పరిశ్రమలు,ఐటీ, ఈ అండ్ సీ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో ఐటీ ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్నాయని చెప్పారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని తెలిపారు. అలాగే ఐటీ రంగంలో 7.99 వృద్ధి రేటుతో 46,489 కొత్త ఉద్యోగులు చేరడంతో, రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల మొత్తం సంఖ్య 6,28,615 కు చేరిందని అన్నారు.
ఇక జాతీయ జీడీపీలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వాటా 2019-20లో 4.74 శాతంగా ఉండగా, 2020-21లో 26 బేసిస్ పాయింట్లు పెరిగి 5.0 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. 2020-21లో దేశ తలసరి ఆదాయం రూ.1,27,768 గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145 గా నమోదైందన్నారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా రూ.2,14,951 కోట్లకుపైగాపెట్టుబడులు, 15.6 లక్షల ఉద్యోగాలను సృష్టి జరిగిందన్నారు.
ప్రతి సంవత్సరం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకుపోతుందన్నారు. సీఎం దార్శనికత, విధానాల రూపకల్పనలో తీసుకునే చొరవ, విధానాల అమలులో చూపెట్టే పట్టుదలతో పాటుగా, అధికార యంత్రంగం సమర్ధతతోనే ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, చేనేత, వస్త్ర, హస్తకళల కార్యదర్శి శైలజ రామయ్యర్, పరిశ్రమల కమిషనర్ మాణిక్ రాజ్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ