తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై శనివారం ఉదయం విచారణ ప్రారంభమైంది. రెవెన్యూ మరియు విజిలెన్స్ అధికారులు అచ్చంపేట గ్రామానికి చేరుకొని రైతుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు.
ముందుగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు కబ్జాకు గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ఫిర్యాదు చేశారు. పౌల్ట్రీ ఫారం కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని, గ్రామస్థులను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రతిని సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ లకు కూడా రైతులు పంపించారు.
ఈ క్రమంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం ఆదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే శనివారం నాడు అచ్చంపేటలో విచారణ ప్రారంభమైంది.
మరోవైపు శుక్రవారం రాత్రి మంత్రి ఈటల రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణనలపై మీడియాతో మాట్లాడారు. తను ఎలాంటి తప్ప చేయలేదని అన్నారు. తనపై ప్రణాళికాబద్ధంగా కుట్రలను, కట్టుకథలను మొదలుపెట్టారని చెప్పారు. ఈ ఆరోపణలపై ఏసీబీతో పాటుగా సిట్టింగ్ జడ్జితో లేదా ఎన్ని దర్యాప్తు సంస్థలుంటే అన్నింటితోనూ విచారణ జరిపించాలని అన్నారు. తానూ తప్పు చేసినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు ఆత్మగౌరవం కన్నా ఏ పదవి ముఖ్యం కాదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ