గత నెల ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారంలో సమ్మక్క, సారలమ్మ మహాజాతర అద్భుతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈసారి మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని అధికారులు తెలిపారు. జాతర అనంతరం అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీ, తిరుగువారంలో వచ్చిన 517 హుండీలను లెక్కించారు. 10 రోజుల పాటు సాగిన ఈ లెక్కింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.
లెక్కింపు పూర్తయిన అనంతరం వచ్చిన మొత్తం ఆదాయాన్ని ప్రకటించారు. రూ.11,44,12,707 ఆదాయం వచ్చినట్లు మేడారం దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాజేంద్రం తెలిపారు. 631 గ్రాముల బంగారం, 48.350 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ హుండీ ద్వారా రూ.3 లక్షలతో పాటు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారని వెల్లడించారు. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. సీసీ కెమెరాల పటిష్ఠ భద్రతల మధ్య మేడారం హుండీ లెక్కింపు జరిగింది. ఏ రోజుకారోజు లెక్కించిన ఆదాయాన్ని అధికారులు బ్యాంకుల్లో జమచేశారు.
ఈ యేడాది జాతరకు ఒక నెల ముందు నుంచే ఇక్కడ కొలువైన అమ్మవార్లను దర్శించుకోవటానికి భక్తులు రావడం మొదలైంది. జాతర సమయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహాజాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ఈ సంవత్సరం దాదాపు కోటి ముప్పై లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ